ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో ఆయన బాబాయి, హత్యకు గురైన నాయకుడు వై ఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిగత విషయాలపై విషం చల్లడాన్ని జగన్ సోదరి వై ఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. వై ఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితంపై గత కొద్ది రోజులుగా సాక్షి దినపత్రికలో వరుసగా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. వై ఎస్ వివేకానందరెడ్డికి రెండో భార్య ఉందని, ముస్లిం అయిన ఆమె కోసం ఆయన తన పేరునే మార్చుకున్నాడని పెద్ద ఎత్తున కొందరు ప్రచారం చేస్తున్నారు.
ఆ ముస్లిం భార్యకు ఒక పిల్లవాడు కూడా వివేకా వల్ల కలిగాడని, ఆ పిల్లవాడికి ఆస్తులు పోతాయనే ఆందోళనతోనే వై ఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వై ఎస్ సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖరరెడ్డి (ఆయన వివేకానందరెడ్డి సతీమణికి సోదరుడు కూడా) కలిసి ఆయనను హత్య చేశారని కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ సీబీఐ రాజశేఖరరెడ్డిని విచారించలేదని, సీబీఐ కేవలం తననే టార్గెట్ చేస్తున్నదని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు, కడప ఎంపి వై ఎస్ అవినాష్ రెడ్డి కూడా తరచూ ఆరోపిస్తున్నారు.
ఆస్తుల కోసం కూతురు అల్లుడు ఆయనను హత్య చేస్తే, అమాయకుడైన తనను సీబీఐ వేధిస్తున్నదని కూడా ఆయన పలుమార్లు చెప్పారు. ఈ కీలక దశలో వై ఎస్ షర్మిల ప్రకటన కీలకంగా మారింది. వై ఎస్ అవినాష్ రెడ్డి తన ఆస్తులు మొత్తం ఎప్పటి నుంచో సునీత పేరు తోనే ఉంచారని షర్మిల స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి ఆస్తులన్నీ సునీత పేరు పైనే ఉంటే వారెందుకు ఆయనను హత్య చేస్తారని షర్మిల ప్రశ్నించారు. వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితంపై చెడు ప్రచారం చేయడం అత్యంత దారుణమైన విషయమని షర్మిల తెలిపారు.
ఇలా చేసే మీడియా సంస్థలు పూర్తిగా తమ విశ్వసనీయతను కోల్పోతాయని ఆమె అన్నారు. వివేకానందరెడ్డి పేరుతో ఒకటో రెండో తప్ప పెద్దగా ఆస్తులు లేవని, వాటిని కూడా సునీత పిల్లలకే దక్కేలా ఆయన వీలునామా కూడా రాశారని షర్మిల తెలిపారు. వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితంపై అత్యంత దారుణమైన విషయాలను ప్రచారం చేస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి ప్రజల మనిషి అని అలాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా చిత్రీకరిస్తున్నారని షర్మిల అన్నారు.