ఎస్ సి, ఎస్ టి అత్యాచార నిరోధక చట్టాన్ని పోలీసులే దుర్వినియోగం చేస్తే…? ఇదే లైన్ లో జరిగిన ఒక కేసు గురించి నాగర్ కర్నూలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కు కొల్లాపూర్ నియోజకవర్గం దళిత, గిరిజన నాయకులు ఒక లేఖ రాశారు. ఈ లేఖ విషయం ఇప్పుడు విస్తృతంగా చర్చనీయాంశం అయింది. దళిత గిరిజన నాయకులు రాసిన లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం ఎస్ ఐ వస్త్రం నాయక్ ఇటీవల కొందరు బాధితులను పోలీస్ స్టేషన్ కు పిలిచారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితులతో ఎస్ ఐ ఎంతో దురుసుగా ప్రవర్తించారు. వారిపై ఎస్ ఐ చెయ్యి చేసుకున్నారు. ఇదే విషయాన్ని బాధితులు వచ్చి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు విన్నవించుకున్నారు.
దాంతో జూపల్లి కృష్ణారావు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇదే విషయాన్ని ఎస్ ఐతో ప్రస్తావించారు. అయితే ఎస్ ఐ వస్త్రం నాయక్ మాట్లాడుతూ “నన్ను అడగటానికి నీవెవరు? అంటూ మాజీ మంత్రి జూపల్లిని బెదిరించారని లేఖలో పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ దళిత దండోరా నాయకులతో, తన సామాజిక వర్గ గిరిజన నాయకులతో కలసి జూపల్లి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసును పెట్టాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదులు ఇవ్వండని రాజకీయ నాటకానికి తెరతీశారని వారు తమ లేఖలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే జూపల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని ఎస్ ఐ జూపల్లి పైనే ఎస్ సి ఎస్ టి కేసు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తన విధి నిర్వహణకు అడ్డు తగిలి జూపల్లి బెదిరించాడని ఆయనతో బాటు మరో అయిదు మంది పై కూడా కేసు నమోదు చేస్తున్నారని వారు లేఖలో తెలిపారు.
రాజకీయ దురుద్దేశాలతో మాజీ మంత్రి జూపల్లి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, ఆ చట్టాన్ని మిస్ యూస్ చేయాలని చూస్తున్న ఫిర్యాదుదారులైన తెలంగాణ దళిత దండోరా నాయకుల పైన, గిరిజన నాయకులుగా వచ్చి అట్రాసిటీ కేసులు బుక్ చేయాలని కోరిన వ్యక్తుల పైన 420 కేసు నమోదు చేసి దళిత, గిరిజనుల రాజ్యంగపు హక్కును రక్షించాలని లేఖలో కోరారు.
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏదో ఒక కులానికి చెందిన అధికారి ఉంటాడు. ఆ అధికారి ఇష్టానుసారంగా వ్యవహరించి అతని ప్రశ్నించిన వ్యక్తులపై తమ సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుంటు బెదిరింపులకు పాల్పడితే సామాన్యులకు న్యాయం దొరకకపోగా వ్యవస్థ లపై ప్రజలకు నమ్మకం పోతుందని తమ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంటే అధికారులు మరింతగా అధికారదుర్వినియోగానికి పాల్పడితే సామాన్యులకు న్యాయం దొరకని పరిస్థితి ఏర్పడుతుందని వారన్నారు.