ఇటీవల వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన చలివేంద్రపు సురేష్, శృంగారపాటి సందీప్ల నుంచి తనకు ప్రాణాహాని ఉందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. వారిద్దరు తనను బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తున్నారని ఆమె గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సందీప్, సురేష్ చట్ట వ్యతిరేకంగా మద్యం వ్యాపారం చేస్తూ, పేకాట ఆడిస్తూ పెదకాకాని పోలీసులకు పట్టుబడ్డారని శ్రీదేవి గుర్తుచేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా వీరిని వైసీపీ మండల పార్టీ నాయకులు వారిద్దరిని పార్టీ నుంచి బహిష్కరించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే తాను అధిష్టానానికి చెప్పడం వల్లే.. వారిద్దరని పార్టీ నుంచి బహిష్కరించిందని సురేష్, సందీప్లు తనపై బెదిరిపులకు పాల్పడుతున్నారని శ్రీదేవి తెలిపారు. ఫోన్లో బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. తన గొంతు మార్ఫింగ్ చేసి మాట్లాడుతూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను బయటకు వెళ్లినప్పుడ వెంటపడుతూ ప్రాణహాని తలపెట్టేలా ఉన్నారని ఆరోపించారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇక, ఎమ్మెల్యే శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని చెప్పారు.