తన తండ్రి షబ్బీర్ అలీ మాదిరిగానే తనను కూడా ఆశీర్వదించాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇలాయాస్ అన్నారు. కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా కామారెడ్డి జిల్లా కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిస్వార్థంగా ప్రజాసేవలో గత 40 సంవత్సరాలలో పేద ప్రజలకు అండగా నిలిచారన్నారు.
ఆయన దారిలోనే తాను కూడా ప్రజాసేవ చేయడానికి యువజన జిల్లా అధ్యక్షునిగా మీ ముందుకు వచ్చానని చెప్పారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి అందరిని కలుపుకొని శాయశక్తుల కృషి చేస్తానన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాడమే తన లక్ష్యమని, ప్రతి కార్యకర్త నిబద్దతతో పని చేయాలని కోరారు. అనంతరం యువజన కాంగ్రెస్ ఎజెండాను విడుదల చేసి దానిని ప్రతి ఒక్కరు అమలు చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా యువజన కాంగ్రెస్ నిర్వహించవలసిన కార్యక్రమాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడంలో పాటించవలసిన వ్యూహాలపై చర్చించారు. రాబోయే కాలంలో భర్తీ చేయవలసిన నామినేటెడ్ పదవులలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కు పెద్దపీట వేసి ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా తీర్మానం చేశారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా దేశ సమగ్రతను కాపాడుదామన్నారు.
రాష్ట్రంలో మొదటిసారిగా ఒక ఎన్ఎస్ఐ అధ్యక్షునికి ఎమ్మెల్సీగా ఒక యువజన కాంగ్రెస్ నాయకునికి రాజ్యసభ సభ్యునిగా పదవులు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జి ఖలీద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మూర్తి గోపి, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, కామారెడ్డి