దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ఆర్ పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. దివంగత నేత వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ విజయనగరం నియోజకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన నగరంలోని సీఎంఆర్ కూడలి వద్ద ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందిస్తూ సువర్ణ పరిపాలనకు వైఎస్ నాంది పలికారని గుర్తు చేశారు. సుపరిపాలనతో ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేశారని అన్నారు.
పేద విద్యార్థులూ ఉన్నత చదువులు చదివి, నేడు మంచి స్థాయిలో ఉన్నారంటే అది వైఎస్ వల్లేనని.. ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని చెప్పారు. వైఎస్సార్ ఆశయ సాధన లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. మహానేత స్ఫూర్తితోనే తమ ప్రభుత్వంలోని మంత్రుల నుంచి, ఎమ్మెల్యేలు, కార్యకర్తల వరకూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు చెప్పారు. అవినీతిపై పోరాటం చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారని.. అసలు రాష్ట్రంలో అవినీతి ఎక్కడ జరుగుతోందని కోలగట్ల ప్రశ్నించారు.
సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాకే జమ చేస్తూ.. ఎక్కడా రూపాయి కూడా, అవినీతికి ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని వెల్లడించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే సేవలు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రతిపక్ష నాయకులకు ఏమీ దొరకనందుకే, అవినీతి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మహానేత చూపిన మార్గంలో భాగంగా నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లను ఈ సందర్భంగా అందజేశారు.
ఎక్కడైనా కొంతమంది మహిళలు ఒక్కటై ఉపాధి కోసం కుట్టు మిషన్లు కావాలనుకుంటే తాము అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.