యోగా అంటే అదేదో ఒక మతానికి సంబంధించిన అంశమనే వాదన నుంచి విశ్వజనీనం చేశారు ప్రధాని నరేంద్రమోడీ. ఆయన కృషి ఫలితంగానే 2014 డిసెంబర్ 11న యోగాను అంతర్జాతీయంగా గుర్తించినట్లు ఐరాస ప్రకటించింది. ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం భారత్ సాధించిన చారిత్రాత్మక విజయం.
ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న కారణంగా జూన్ 21వ తేదీన యోగా సాధన చేయాలని సూచించారు. అప్పటినుంచి భారతదేశంలో యోగా దినోత్సవాన్ని జరుపుతున్నారు. మోదీ నేతృత్వంలో 2015 జూన్ 21న రాజపథ్ లో నిర్వహించిన యోగా దినోత్సవంలో 84 దేశాల ప్రతినిధులు, సుమారు 36 వేల మంది ప్రజలు అత్యుత్సాహం గా పాల్గొని జయప్రదం చేశారు.
21 యోగాసనాలతో,35 నిమిషాల పాటు సాగిన యోగా సాధన 2 గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డులు సాధించడం విశేషం. “యోగా సాధన మనిషిలో నిగ్రహశక్తిని పెంచి,ప్రకృతితో సామరస్యాన్ని పెంపొందించి, ఐక్యతాభావాన్ని ఆవిష్కృతం చేయగలదు.”…
ఐక్యరాజ్య సమితికి చెందిన సాధారణ సభలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగస్ఫూర్తి సమకాలీన సంక్షోభం సమయంలో కొంతమేరకైనా ప్రజలకు సాంత్వన ఇస్తుందని విశ్వసించవచ్చు. “ఇంటింటా యోగా–కుటుంబం తో యోగా” సత్ఫలితాలిచ్చే సర్వజనామోద భారతీయ వారసత్వ సంపద అంటున్న కేంద్ర ప్రభుత్వప్రకటన సందర్భోచితం.
పొలమరశెట్టి కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాంత ఉన్నతాధికారి