(సత్యం న్యూస్ ప్రత్యేకం)
ప్రపంచానికి భారత దేశం ఎన్నో అద్భుతాలను అందించింది. అందులో ప్రధానమైనది యోగా. యోగా లాంటివి అభ్యాసం చేయడం వల్లే హిందూ సాంప్రదాయం ఒక మతంగానే కాకుండా ఒక జీవన విధానంగా ప్రపంచానికి పరిచయం అయింది. హిందూ జీవన విధానంలో మానవుడు అనుసరిచనాల్సిన శారీరక ధర్మాలతో బాటు, మానసిక, ధార్మిక, ఐహికపరమైన అన్ని విషయాలను పొందుపరిచారు.
ప్రపంచంలో సమగ్రమైన ధర్మం ఏదైనా ఉందీ అంటే అది హిందూ ధర్మమే. అలాంటి హిందూ ధర్మం తీసుకువచ్చిన విధానమే యోగా. 2500 ఏళ్ల క్రితం భారత దేశంలో సాధువులు యోగా సాధనలు చేసేవారని యూనివర్సిటీ ఆఫ్ లండన్కు చెందిన పరిశోధకుడు, సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ జిమ్ మల్లిన్సన్ తన సిద్ధాంత పత్రంలో వెల్లడించారు.
ఆయన యోగా చరిత్ర మీద అధ్యయనం చేసిన వారిలో ప్రముఖుడు. అయితే మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న యోగా విధానం అప్పటి యోగా విధానానికి తేడా ఉంటుంది. గడచిన శతాబ్ద కాలంలో ప్రపంచీకరణలో భాగంగా యోగా కూడా అనేక రూపాలు తీసుకుంది. విభిన్నమైన కొత్త ఆసనాలు ఆచరణలోకి వచ్చాయి.
ఎన్నో మార్పులకు గురి అయిన యోగా
చాలా దేశాల్లో యోగాకు ప్రాధాన్యత కూడా బాగా పెరిగింది. అష్టాంగ యోగా, అయ్యంగార్, విన్యాస యోగా కూడా ఈ క్రమంలో రూపుదిద్దుకున్నవే. ‘అష్టాంగ యోగ’ను పతంజలి మహర్షి సిద్ధం చేశారని చెబుతారు. ప్రస్తుతం చాలామందికి తెలిసిన ‘సూర్యనమస్కారం’ లాంటి కొన్ని యోగా ఆసనాలు ఒకప్పుడు వాడుకలో ఉండేవి కాదు.
1930ల నుంచే ‘సూర్యనమస్కారం’ ఆసనం ప్రాచుర్యంలోకి వచ్చినట్లు చరిత్ర పుస్తకాలను తిరగేస్తే తెలుస్తోంది. అప్పట్లో స్థిరంగా ఒక భంగిమలో ఉంటూ యోగా చేసేవారని, ప్రస్తుతం యోగా శిక్షణ కేంద్రాల్లో మనం చూస్తున్న శారీరకపరమైన ఆసనాలు అప్పట్లో ఉండేవి కాదు.
స్వామి వివేకానంద (1863-1902) పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేసి వ్యాప్తిలోకి తెచ్చారు.1893లో షికాగో వేదికగా జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ప్రసంగించేందుకు అమెరికా వెళ్లిన స్వామీ వివేకానంద భారత్ ప్రతిష్ట, హిందూ మతం గురించి తన ఉపన్యాసాలలో వివరించారు.
1896లో అమెరికాలోని మన్హటన్ నగరంలో ఆయన ‘రాజ యోగా’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. యోగా ప్రాముఖ్యతను పశ్చిమ దేశాలు తెలుసుకునేందుకు ఆ పుస్తకం దోహదపడింది. జూన్ 21 ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’.
ఈ రోజును పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల్లో కోట్లాది మంది యోగా చేస్తారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం చేసిన సూచనతో జూన్ 21ని ‘అంతర్జాతీయ యోగా డే’గా ఐక్యరాజ్యసమితి 2015లో ప్రకటించింది.