‘యోగీశ్వరం ప్రణమ్యాం’ ‘యోగాభ్యాసే సమారంభే ‘- యోగం చేస్తే ఈశ్వరునికి ప్రణామం చేసినట్టే యోగాను అభ్యసిస్తే ఏదైనా సాధ్యమే అని మన ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి. యోగా అనే పదం సంస్కృతంలోని ‘యుజ’ అనే దాని నుండి వచ్చింది. ‘యుజ ‘ అంటే చేరడం లేదా ఏకంచేయడం అని అర్థం.
మనసుని ఏకం చెయ్యడమే యోగా లోని పరమార్ధం. శారీరక ,మానసిక ,ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం. టెక్నాలజీ పుట్టకముందు పుట్టిన యోగా నేడు మనిషి యోగాన్నే మార్చివేసే ఒక మహత్తర ప్రక్రియ అంటే ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు.
శారీరక మాసిక ఆరోగ్యానికి యోగా
యోగా అనేది శరీరానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే మనసును కూడా దానికి జత చేస్తుంది. మనిషిని వ్యక్తిగాను సంఘజీవిగాను ముఖ్యంగా సుఖ సంతోషాలతో జీవించే సమగ్ర ప్రాణిగాను తీర్చిదిద్దేందుకు సమాయాత్తం చేస్తుంది, ఇది ఒక సంపూర్ణ జీవన విధానం.
నేడు కరోన మహర్దశ నడుస్తున్న కాలం నిరుపేద నుండి ఆగర్భ శ్రీమంతులు వరకు ఎవరినీ వదిలిపెట్టని మహమ్మారికి ఖర్మవశాత్తూ విరుగుడనేది ఇంకా వెలుగులోకి రాలేదు. మరి ఇలాంటి ఆపత్కాలంలో యోగాయే పట్టుకొమ్మగా ప్రాణాధారంగా నిలిచింది. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తారకమంత్రం.
ప్రాణాయామం సూర్యనమస్కారాలు నేడు ప్రాణాన్ని నిలబెట్టే సాధనాలు.శ్వాసను శాసించే శాసనాలు. మానసిక ఆందోళనను తగ్గించి వ్యక్తిలో నిగ్రహాన్ని పెంచి మనిషికి ప్రకృతికి మధ్య సామరస్యాన్ని పెంపొందించే ప్రక్రియలో యోగా ప్రాముఖ్యత అనుపమానము.ఒత్తిడి ,భయం ,అభద్రత, అసంతృప్తి పాటు ఆధునిక జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న అనేకానేక సవాళ్ళను అధిగమించడానికి మహర్షులు ప్రసాదించిన గొప్ప కానుక ఇది.
ప్రధాని మోదీ ప్రతిపాదనకు ప్రపంచం ఆమోదం
జూన్ 21 ఉత్తరార్థగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి ప్రాధాన్యత ఉంది అందుకే ఈ రోజుని యోగా దినంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రధాని నరేంద్ర మోదీ 2014 లో ప్రతిపాదించడం జరిగింది డిసెంబర్ 11 న ఆమోదయోగ్యం అయ్యింది.
దిన దిన ప్రవర్ధమానంగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో నేడు ఆరవ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ప్రాచీన కాలంలో మహర్షులు చేసుకునే ఎన్నో ఆసనాలను క్రోడీకరించి యోగాకు ఒక రూపు ఇచ్చినవారు పతంజలి.
అందుకే ఈయనను యోగా పితామహుడుగా అభివర్ణిస్తారు. ఆధునిక కాలంలో యోగా గురించి ప్రజలు చర్చించుకునేలా చేసింది బి.కె.ఎస్ అయ్యంగార్. ఆయన కృషి వల్ల యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది కానీ సామాన్య జనాల్లోకి యోగాను తీసుకెళ్లిన ఘనత బాబా రాందేవ్ గారిదే.
ఏది ఏమితేనేం యోగాను నమ్మితే రోగానికి దూరం కావొచ్చనేది ఒక సుస్పష్టమైన వాస్తవం. మరింకెందుకు ఆలస్యం ఆత్మీయులైన పాఠకులారా మొదలుపెట్టండి యోగా ఆరోగ్యవంతమైన సుఖ భోగ జీవితానికి ఆహ్వానం పలకండి. సర్వేజనా సుఖినోభవంతు
మంజుల సూర్య, హైదరాబాద్, 9704022244