కరోనా బారిన పడి ఒక వ్యక్తి మరణించగా అతని బంధువులు గాంధీ ఆసుపత్రి వైద్యుడిపై దాడి చేసిన అత్యంత హేయమైన చర్య నేడు జరిగింది. నిర్మల్ జిల్లాకు చెందిన అన్నదమ్ములిద్దరికి కరోనా సోకింది. వారిద్దరిని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స చేశారు. అయితే ఫలితం దక్కలేదు. అన్నదమ్ములిద్దరిలో ఒకడు మరణించాడు. ఈ మరణాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ ధృవీకరించారు. అయితే డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే మరణించాడని రోగి బంధువులు గొడవ చేసి డాక్టర్ పైనా అక్కడి సెక్యూరిటీ గార్డులు, వార్డుబాయ్లపై రోగి బంధువులు దాడికి పాల్పడ్డారు.
దీంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మృత దేహం తీసుకవేళ్ళేది లేదంటూ వారు గొడవ చేశారు. గాంధీ హాస్పిటల్ లో డాక్టర్ ల పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిలో క్షమించం.
దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఏంటి? డాక్టర్స్ మీద దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి గంభీరమైన సమయంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. 24 గంటలు డాక్టర్లు ప్రజల కోసం పని చేస్తున్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ప్రతి డాక్టర్ కి రక్షణ కల్పిస్తాం. భరోసాతో పని చేయండి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాము అని ఆయన అన్నారు.