డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పనులను వేగవంతం చేసి, త్వరితగతిన లబ్దిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని అల్లిపురం, వైఎస్సార్ నగర్లో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.
అల్లిపురంలో 8 బ్లాకుల్లో 192 గృహాలను జి ప్లస్ 2 పద్దతిలో నిర్మాణాలకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 168 గృహాల పనులు ప్రారంభించగా, ప్లాస్టింగ్ దశకు చేరుకున్నట్లు తెలిపారు. బ్లాకుల వారిగా పనులు పూర్తిచేసి, పూర్తి అయిన బ్లాకులను వెంట వెంటనే అందజేయాలన్నారు.
వైఎస్ఆర్ నగర్ లో 4 బ్లాకుల్లో జి ప్లస్ 2 పద్దతిలో 96 గృహాలు నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. ఇట్టి గృహాల్లో ప్లాస్టింగ్ మిగులు పనులు చేపట్టాల్సి ఉందని అన్నారు. పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులు త్వరగా పూర్తయితే బిల్లులు వెంటనే వస్తాయని ఆయన తెలిపారు.
వర్కర్లను పెంచాలని, అన్ని బ్లాకుల్లో పనులు చేపట్టాలని ఆయన అన్నారు. పనుల్లో రోజువారి పురోగతి ఉండాలని, అధికారులు రోజూ పనులు జరిగేట్లు పర్యవేక్షణ చేయాలన్నారు. అధికారులు ప్రత్యేకశ్రద్ధ వహించాలని ఆయన తెలిపారు.
అనంతరం వై.ఎస్.ఆర్ నగర్ బస్తీ ధవాఖానలో వైద్య సేవలను కలెక్టర్ ఆకస్మిక తణిఖీ చేశారు. అందించే వైద్య సేవలు, ఔషదాల నిల్వ వివరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిజనల్ వ్యాధుల ప్రభలుతున్నందున వైద్య అధికారులు ప్రత్యేక శ్రద్ధకనబర్చి వచ్చే రోగులకు నిరంతరాయంగా వైద్య సేవలందించాలన్నారు.
వై.ఎస్.ఆర్ నగర్లో ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న వారికి ప్రభుత్వ ఉత్వర్వునెం.58, 59 పై అవగాహన కల్పించారు. డిమాండ్ చెల్లింపు త్వరితగతిన పూర్తిచేసి పట్టాలు పొందాలని తెలిపారు. పట్టాలు పొందడం వల్ల కలిగే ప్రయోజనాలను నివాసులకు తెలియజేశారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.