10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో 10వ తరగతి పరీక్షలపై చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, పరీక్షలను అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా నిర్వహించాలన్నారు. పరీక్షల కోసం రవాణా, నీటి సౌకర్యం కల్పన, మెడికల్ కిట్స్ ఏర్పాటు, పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. పరీక్షలకు చాలా తక్కువ సమయం ఉందని, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ సూచనలని తప్పనిసరిగా పాటించాలన్నారు.
పరీక్షల నిర్వహణలో అన్ని రకాల అంశాలపై ప్రతి ఒక్కరికి 100 శాతం క్లారిటీ ఉండాలన్నారు. పరీక్ష హాల్లోకి విద్యార్థులు ఏ విధమైన సెల్ ఫోన్ లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా చూడాలన్నారు. సిబ్బంది కూడా ఎవరు సెల్ ఫోన్ తీసుకురాకూడదన్నారు. పరీక్షల కోసం ప్రశ్నాపత్రం రవాణా, సెక్యూరిటీ ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి సమస్య రాకుండా పరీక్షలు నిర్వహించాలని, ఎలాంటి ఫిర్యాదులు కూడా రావడానికి వీలు లేదన్నారు. పరీక్ష కేంద్రంలో ఏం జరిగినా చీఫ్ సూపరింటెండెంట్ లదే బాధ్యత అన్నారు. పరీక్షలను సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేస్తారన్నారు. ప్రోటోకాల్ ను జాగ్రత్తగా పాటించాలని, పదోవ తరగతి పరీక్షలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించాలన్నారు.
ఈ సందర్భంగా చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు పదో తరగతి పరీక్షల నిర్వహణ పై ఆర్ పి శ్రీదేవి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పదవ తరగతి పరీక్షల జిల్లా అబ్జర్వర్ గీత, డిఈఓ శామ్యూల్, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, ఏడి రవుఫ్, చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.