పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు అన్నారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో పదో తరగతి, మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల సన్నాహక ఏర్పాట్లపై విద్య, వైద్యం, రెవెన్యూ, పోలీసు, రవాణా, విద్యుత్ పంచాయతీరాజ్ మున్సిపల్ తదితర శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్ ఏవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి, మోడల్ స్కూల్ ప్రవేశం పరీక్షలు నిర్వహించే సమయంలో లైన్ డిపార్ట్మెంట్ సహకరించాలని సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, ఆర్టీసీ, పోస్టల్, మున్సిపల్, పంచాయతీ, హెల్త్ డిపార్ట్మెంట్ పరీక్ష సజావుగా జరగడానికి సహకరించాలని కోరారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వివరిస్తూ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసేలా ప్రణాళికయుత చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వేసవి వేడిమీ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, త్రాగునీరు విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడపాలని, అన్ని పరీక్షా కేంద్రాలను ముందస్తుగానే శానిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. పదో తరగతి పరీక్షల సమయంలో 144 సెక్షన్ తో పాటు జిరాక్స్ సెంటర్లు మూసి వేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
డీఈవో గోవిందరాజులు మాట్లాడుతూ.. జిల్లాలో పదోతరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 63 సెంటర్లలో 288 అన్ని యాజమాన్యాల పాఠశాలల నుంచి మొత్తం 11,060 మంది పరీక్ష రాస్తారన్నారు. ఇందులో 5,498 మంది బాలికలు, 5,562 బాలురు ఉన్నారని అన్నారు.
63 చీఫ్ సూపరింటెండెంట్లు, 63 డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ను జిల్లా కలెక్టర్ అనుమతితో నియమించినట్లు తెలిపారు. ముగ్గురు రూట్ ఆఫీసర్లను, 560 ఇన్విజిలెటర్లను నియమించినట్లు చెప్పారు. అదేవిధంగా ఈనెల 24వ తేదీ ఆదివారం వెల్దండ, కోడేరు మోడల్ స్కూల్ లో ఆరో తరగతి నుండి పదోవ తరగతి ప్రవేశాల పరీక్ష జరగనుంది అన్నారు.
ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. 1,122 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు హాజరుకానున్నారని డిఇఓ తెలిపారు.
ఈ సమావేశంలో డిటిఓ లక్ష్మీనారాయణ, పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖరరావు, సీఐ శ్రీనివాస్, పోస్టల్ అధికారి సౌరబ్ కుమార్, ఆర్టీసీ ఇన్స్పెక్టర్ స్వామి, విద్యా శాఖ సిబ్బంది వెంకట్, విశ్వనాధ్, కృష్ణ 4 మున్సిపాలిటీల మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.