ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఆ కుటుంబ సభ్యులందరూ ఒకే సారి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు మొత్తం 11మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. జోధ్పూర్లో నివాసం ఉంటున్న ఓ కుటుంబంలోని 12 మంది విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
వీరిలో 11మంది మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు జోధ్పుర్ పోలీసులు వెల్లడించారు. ఈ విషాద ఘటన రాజస్థాన్లోని దేచు పోలీసు స్టేషన్ పరిధిలో తోహ్దాత గ్రామంలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. పాకిస్తాన్లోని సింధూ ప్రావిన్స్కు చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం రాజస్థాన్కు వచ్చింది.
వీరంతా హిందూ శరణార్థులు. వీరు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో పురుగుల మందు వాసన వెదజల్లుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు దృష్టి సారించారు.
క్లూస్ టీమ్ తో ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తోహ్దాత గ్రామంలో వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని దానికి సమీపంలోనే నివాసం ఉంటున్నారు. నేటి ఉదయం ఇంటి సమీపంలో ఈ కుటుంబంలోని వారందరూ విగత జీవులుగా పడివుండటాన్ని గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని పరిశీలించగా అప్పటికే వారిలో 11మంది ప్రాణాలు కోల్పోయినట్లు గ్రహించారు.
ఇంటి బయట ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతన్ని ఆసుపత్రికి తరలించారు. క్లూస్టీంతోపాటు ప్రత్యేక దర్యాప్తు బృందం అక్కడకు చేరుకొని ఘటనకు కారణాలను విశ్లేషిస్తున్నారు. ఘటనా స్థలాన్ని జోధ్పుర్ జిల్లా ఎస్పీ రాహుల్ భర్హత్ పరిశీలించారు.
మృతదేహాలపై ఎలాంటి గాయాలూ లేవు
సామూహిక మరణాలకు గల కారణాలు తెలియలేదని, వారి శరీరంపై ఎలాంటి గాయాల మరకలు కూడా లేవని ఎస్పీ రాహుల్ మీడియాకు తెలిపారు. ఏదో ఒక విషయంపైనే కుటుంబసభ్యుల మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
అందులో భాగంగానే నిన్న రాత్రి వేళలో సామూహికంగా విషం తీసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తిని విచారిస్తే పూర్తి సమాచారం దొరికే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం.