సూడాన్ లోని ఒక పింగాణీ పరిశ్రమలో ఎల్ పి జి ట్యాంకర్ పేలడంతో 23 మంది మరణించారు. అందులో 18 మంది వరకూ భారతీయులు ఉన్నారు. బుధవారంనాడు జరిగిన ఈ పెను ప్రమాదంలో దాదాపు 130 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ పింగాణీ ఫ్యాక్టరీ మొత్తం ఈ పేలుడుకు ధ్వంసం అయింది.
మరో 16 మంది భారతీయుల సమాచారం తెలియడంలేదని ఇండియన్ మిషన్ తెలిపింది. ఈ పేలుడుతో సూడాల్ లోని ఆ ప్రాంతం అంతా నల్లని దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పూర్తిగా ధృవీకరణ కాలేదు కానీ దాదాపుగా 18 మంది భారతీయులు చనిపోయారనే ప్రాధమిక సమాచారం ఉందని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
కనిపించకుండా పోయిన 16 మందిలో కూడా మృతులు ఉండవచ్చునని రాయబార కార్యాలయం అధికారులు అభిప్రాయపడ్డారు. సూడాన్ లోని ఆ పింగాణీ ఫ్యాక్టరీలో మొత్తం 68 మంది భారతీయులు పని చేస్తున్నారు. జీవనోపాధి కోసం అంత దూరం వెళ్లిన వారు విగత జీవులుగా మారారు.
చనిపోయిన వారి వివరాలు తెలుసుకోవడానికి భారత రాయబార కార్యాలయం ప్రత్యేక హాట్ లైన్ ఏర్పాటు చేసింది. 24 గంటల ఎమర్జన్సీ హాట్ లైన్ నెంబర్ +249-921917471 కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చునని భారత రాయబార కార్యాలయం తెలిపింది.