పెద్దపల్లి జిల్లా మంథని మండలం గోపాల్ పూర్ మానేరులోని ఇసుక క్వారీలో పని చేస్తున్న 19మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇందులో తెలంగాణకు చెందిన ముగ్గురు ఉండగా, మిగతా వారంతా ఇతర రాష్ట్రా వారు ఉన్నారు. ఇసుక క్వారీలో ఉన్న మిషనరీ తీసుకొచ్చేందుకు 19 మంది కూలీలు, డ్రైవర్లు మానేరులోని వెళ్లారు.
వర్షం కురవడంతో పాటు వరద ఉధృతి పెరిగి వారంతా క్వారీలోనే చిక్కుకున్నారు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బయటకు రాలేకపోయారు. ఈ విషయం తెలుసుకుని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, గోదావరిఖని ఏఎస్పీ తులా శ్రీనివాసరావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మంథని గోదావరిఖనిలో నుంచి పడవలను తెప్పించారు. అలాగే విలోచవరం , బోయిన్ పేట, గోదావరిఖని ప్రాంతాలకు చెందిన రెస్క్యూ టీంను రంగంలోకి దింపారు. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో పడవలు మానేరులోకి వెళ్లడానికి ఆటంకం ఎదురైంది. పడవలు కూడా మోరాయించడంతో మోటార్లు మార్చడానికి సమయం పట్టింది.
దీంతో మానేరులో చిక్కుకున్న వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇసుక కుప్పలపై ఉన్నారు. మరోచోట ఇద్దరు జేసీబీ పై నిలబడి ప్రాణాలు కాపాడుకున్నారు. గంటల తరబడి భయంతో అక్కడే ఉండిపోయారు. రెస్క్యూ టీం రెండు పడవల సాయంతో రెస్యూ టీం 19 మందిని మానేరులో నుంచి బయటకు తీసుకొచ్చారు. అప్పటిదాకా కలెక్టర్ ముజమిల్ ఖాన్, ఏఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో హనుమ అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా అంతా సురక్షితంగా బయట పడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.మానేరు వాగు వద్ద గల ఇసుక క్వారీ నుంచి సురక్షితంగా 19 మంది కార్మికులను బయటకు తీసుకురావడంలో పోలీస్, అగ్ని మాపక, రెవెన్యూ శాఖ, మత్స్యకారులు చేసిన కృషి ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కొనియాడారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో డిసిపి వైభవ్ గైక్వాడ్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, ఎంపీపీ శంకర్, ఎంపీడీఓ రమేష్, తహసిల్దార్ సిరిపురం గిరి, మంథని సి.ఐ. సతీష్, పోలీస్, అగ్నిమాపక అధికారులు, పాల్గొన్నారు.