ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, మరికలలో గోదావరి రేవు వద్ద స్నానానికి వెళ్లిన 16 మందిలో నలుగురు గల్లంతు అయిన ఘటనపై రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ లతో మాట్లాడి ఆరా తీశారు. గల్లంతైన వారిని వెంటనే వెతికే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అలాగే ఆయా చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అయితే, గజ ఈతగాళ్లను ఇప్పటికే రంగంలో దించామని, అవసరమైన అన్ని చర్యలు చేపడుతామన్నారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, తప్పిపోయిన వాళ్ళను వెతకడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. పండగ రోజు ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమ ని విచారం వ్యక్తం చేశారు.
నదిలోకి వెళ్ళే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాగా 16 మంది యువకులు బర్త్ డే వేడుకలను నిర్వహించుకోవడానికి గోదావరి వద్దకు వెళ్లారు. అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే ముగ్గురు యువకుల మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటికి తీసినట్లు మరో యువకుడి కోసం తీవ్రంగా గాలింపు చేపడుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించారు. సంఘటన జరిగిన ప్రాంతంలో మృతుల బంధువుల రోదనలతో తీవ్ర విషాదం నెలకొంది.