భారతదేశంలో ఎంతమంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు పనిచేస్తున్నారు? అందులో ఎంత మందిపై అవినీతి, ఆరోపణలు ఉన్నాయి? ఎంతమందికి శిక్షపడింది? ఎంత మందిపై విచారణ జరుగుతోంది? రాష్ట్రాల వారీగా సమాచారం కావాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ విభాగానికి సమాచార హక్కు చట్టంతో దరఖాస్తు చేసింది. ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు వెలువడ్డాయి. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ చేసిన దరఖాస్తుకు వచ్చిన సమాచారం దేశవ్యాప్తంగా 2012 వరకు నమోదైన 96 అవినీతి నిరోధక శాఖ కేసుల్లో 65మంది ఐఏఎస్ అధికారులు విచారణ ఎదుర్కొంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ విభాగం తెలిపింది.
2012 నుంచి ఇప్పటి వరకు ఎంతమందిపై విచారణ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం తెలపలేదు. వారు తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఒడిశాలో ముగ్గురు, ఉత్తరప్రదేశ్లో ఒకరు, అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం కేంద్ర పాలిత ప్రాంతం కేడర్లో ఒకరు చొప్పున అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు. వీరు వివిధ కేసుల్లో దోషులుగా తేలగా.. కొన్ని కేసుల్లో శిక్ష పడినట్లు తెలిపారు. ఇందులో ఒకరు సర్వీసులో ఉండగా, మిగతా నలుగురు పదవీ విరమణ చేశారు. తమిళనాడు కేడర్కు చెందిన ఒక ఐపిఎస్ అధికారి లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్నారని ఆర్టీఐ చట్టం ప్రకారం అధికారి పేరు తెలపలేమని కేంద్రం సమాచారం ఇచ్చినట్లు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు.
యూత్ ఫర్ యాంటీకరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి సత్యంన్యూస్.నెట్ తో మాట్లాడుతూ దేశంలో ప్రజల కోసం పనిచేసే పాలకులు, అధికార యంత్రాంగం ఎంతో మంది ఉన్నారో, వారేమి పని చేస్తున్నారో పన్నులు కట్టి జీతాలు ఇస్తున్న ప్రజలకు, నాయకులకు అధికారాన్ని కట్టబెట్టే ఓటర్లకు తెలియడం లేదు. పాలకులు, అధికారులు ఏం చేసినా బయటికి రాకుండా ఉంటుంది. నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నామని చెపుతున్న పాలకుల, అధికారుల పనితీరుపై, ఇప్పటి తరానికి తెలియజేసే ప్రయత్నం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ చేస్తోంది. గ్రామ నుంచి ఢిల్లీ వరకు ప్రజలకు, సమాజానికి సంబంధించిన ప్రతి అంశాన్ని సమాచారహక్కు చట్టం ద్వారా బయటపెట్టి తెలియజేసే ప్రయత్నం వైఏసీ శాంతియుతంగా చేస్తోంది.. గ్రామస్థాయి నుంచి ఢిల్లీలో జరిగే ప్రతి విషయం ఇప్పుడు ప్రజలకు తెలిసే ప్రయత్నమే మేము చేస్తున్నాం..అని అన్నారు.