గుంటూరు జిల్లా నరసరావుపేట పరిసరాల్లో ఆలయాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ ను కలిసి కోరారు. విజయవాడలోని గొల్లపూడిలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ తో ఆయన మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
మహశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో జరగనున్న తిరుణాళ్లకు ఆలయ అభివృద్ధితో పాటు రోప్ వే గురించి కమిషనర్ తో చర్చించారు. పల్నాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధ ఆలయం కోటప్పకొండ మహశివరాత్రి నాడు జరిగే తిరుణాళ్లకు లక్షల సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తారని ఆయన తెలిపారు.
వచ్చిన భక్తులు వెంటనే స్వామిని దర్శించుకునేందుకు వీలుగా జరుగుతున్న పనులపై కమిషనర్ కి వివరించారు. తిరుణాళ్ల దృష్ట్యా అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. అదే విధంగా నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధి కోసం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.