రూ. 2 వేల నోట్లను రద్దు చేసిన తర్వాత నుంచి జూన్ 30 నాటికి 76 శాతం నోట్లు బ్యాంకులకు చేరాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఇప్పటివరకు తిరిగి వచ్చిన మొత్తం నోట్ల విలువ రూ. 2.72 లక్షల కోట్లని ఆర్బీఐ తెలిపింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ. 3.62 లక్షల కోట్ల చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్ల విలువ మే 19 నాటికి రూ. 3.56 లక్షల కోట్లకు తగ్గింది.బ్యాంకుల సమాచారం ప్రకారం, జూన్ 30 నాటికి ఇంకా రూ. 84 వేల కోట్ల విలువైన పెద్ద నోట్లు చలామణిలో ఉన్నాయి.
ప్రధాన బ్యాంకుల నుంచి లభించిన వివరాలను బట్టి చలామణి నుంచి తిరిగి బ్యాంకులకు చేరిన రూ. 2 వేల నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో రాగా, మిగిలిన 13 శాతం ఇతర నోట్ల మార్పిడి ద్వారా వచ్చాయని ఆర్బీఐ పేర్కొంది. సెప్టెంబర్ 30 నాటికి ప్రజలు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను డిపాజిట్ లేదా మార్పిడి ద్వారా మార్చుకోవచ్చని, వచ్చే మూడు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది.