అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ఎన్నికల జపం చేస్తున్నారు. ‘‘ఈ రోజు నుంచే మనం ఎన్నికలకు సిద్ధం కావాలి’’ అంటూ ఆయన కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆయన ముందస్తు ఎన్నికలకు వెళతారా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇదే సమయంలో ఆయన సతీ సమేతంగా వెళ్లి రాష్ట్ర గవర్నర్ ను బిశ్వభూషన్ హరిచందన్ ను కలవడం కూడా చాలా మందిని ఆశ్చర్య పరచింది.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ కు వివరించి ఆయన సలహా తీసుకున్నారేమోననే మాట వినిపిస్తున్నది. జగన్ ముందస్తు ఎన్నికల విషయం ముందుగానే పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు కూడా ఎన్నికలు ఏ క్షణాన అయినా వచ్చే అవకాశం ఉందని తమ పార్టీ నాయకులతో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు గమనిస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకే జగన్ మొగ్గు చూపుతున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ఇంకా 40 నుంచి 50 స్థానాలలో బలపడలేదని ప్రశాంత్ కిషోర్ బృందం ఇటీవల ఒక నివేదికను సీఎం జగన్ కు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అందువల్ల వైసీపీ ఆ 50 స్థానాలలో గెలవడం ఖాయమని అందువల్ల మరో 50 స్థానాలపై దృష్టి సారిస్తే సరిపోతుందని ప్రశాంత్ కిషోర్ బృందం అంచనా వేస్తున్నది. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతోనే ఆయన ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారని చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బలం పుంజుకున్న స్థానాలను తీసేసినా వైసీపీకి మళ్లీ అధికారం దక్కడం ఖాయమని పీకే అంచనా వేస్తున్నారు. మూడు ప్రాంతాలలో ప్రజలకు రెచ్చగొట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీని కార్నర్ చేయాలని, దీనివల్ల ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి అవకాశం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలపడే లోపే ఎన్నికలు నిర్వహించుకుని గట్టెక్కడాలనే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు వైసీపీ నాయకులు కూడా అనుకుంటున్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలను మరింత పూర్తి స్థాయిలో రెచ్చగొట్టాల్సిన అవసరం ఉందని కూడా వారు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర నాయకులు ప్రెస్ స్టేట్ మెంట్లు ఇస్తున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో ప్రజలను సమీకరించడం లేదని పార్టీ అగ్ర నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో ప్రజలను పూర్తి స్థాయిలో సమీకరించే లోపు రాయలసీమ పై కూడా దృష్టి సారించాలని వైసీపీ అగ్ర నాయకులు భావిస్తున్నారు.
అందుకు కార్యాచరణ కూడా ఇప్పటికే ప్రారంభించారు. వచ్చే ఎన్నికలలో ఉత్తరాంధ్ర, రాయలసీమ పైనే పూర్తిగా ఆధారపడి రాజకీయం చేయాలని వైసీపీ భావిస్తున్నది. మధ్య ఆంధ్రలో కమ్మ కులస్తుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటం, కాపు కులస్తులు పార్టీ నుంచి దూరం జరగడం కారణంగా ఆశలన్నీ ఉత్తరాంధ్ర, రాయలసీమ పైనే పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్నది.
ఈ రెండు ప్రాంతాలలో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని లెక్కలు వేసుకుంటున్నారు. కోస్తా ప్రాంతంలో పార్టీకి తీవ్ర వ్యతిరేక ఉన్నందున ఈ అంశంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని వైసీపీ భావిస్తున్నది. పరిస్థితి చూస్తుంటే సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకే సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తున్నది.