వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి , అధర్మారెడ్డి అని, 5వేల కోట్లు సంపాదించాడని, ఎమ్మెల్యే ముసుగులో ఉన్న కాంట్రాక్టర్ అని, చిన్నవైనా, పెద్దవైనా అన్ని కాంట్రాక్ట్ లు తానే చెయ్యాలని,తానే సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను సాగిస్తున్న వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేరింది. ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ప్రస్తావించడంతో పాటుగా, స్థానిక ఎమ్మెల్యేల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పరకాల నియోజకవర్గంలో పర్యటిస్తున్న షర్మిల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్నవైనా, పెద్దవైనా అన్ని కాంట్రాక్ట్ లు తానే చెయ్యాలని,తానే సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భూకబ్జాలకు పాల్పడి భూబకాసురుడయ్యాడని విమర్శలు గుప్పించారు. ఇసుక మాఫియా,మట్టి మాఫియా నడిపిస్తూ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నాడని ధర్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చల్లా అవినీతిని ప్రశ్నించిన తమ పార్టీ కార్యకర్తలను జైలులో పెట్టించాదని, ధర్మారెడ్డి అధికారమదంతో వైయస్ఆర్ విగ్రహాన్ని కూల్చాడని దుయ్యబట్టారు. దళితులు, బీసీలంటే ఈయనకు లెక్కే లేదని విమర్శించారు. దళిత ఉద్యోగుల పట్ల ఇంగితం లేకుండా మాట్లాడతారని నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై ఈ ఎమ్మెల్యేకు బుద్దిచెప్పాలని షర్మిల పేర్కొన్నారు.
previous post
next post