వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు నేపథ్యంలో ఈనెల 29న ఖమ్మం నగరంలో లక్ష మంది ప్రజలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు, జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, అభిమానులు ఖమ్మం రాబోతున్నారని, ఈ భారీ సభ జయప్రదం చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. సుందరయ్య భవనంలో జరిగిన ఖమ్మం టౌన్ జనరల్ బాడీ సమావేశం మాజీ కౌన్సిలర్ నర్రా రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థలకు నిధులను పూర్తిగా తగ్గించి పనులను నీరుగారుస్తున్నదని విమర్శించారు. అట్టడుగు వర్గాలపై ఉన్న ఆదివాసీ గిరిజనులపై, దళిత మహిళలపై లైంగిక దాడుల పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, అలాగే అటవీ హక్కుల చట్టం, భూసేకరణ పునరావాస చట్టాలను అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం తొక్కిపెడుతున్నదని విమర్శించారు. 29న మధ్యాహ్నం పెవిలియన్ గ్రౌండ్ నుంచి వేలాది మంది ప్రజలతో రెడ్ కవాత్ జరుగుతుంది అని, ఖమ్మం నగరాన్ని ఎర్రమయం చేస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.