కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. వచ్చే నెల 10 నుంచి 14 వరకు న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ (హెచ్ఎల్పిఎఫ్)లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, కార్యనిర్వాహక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రసంగించనున్నారు.
గ్లోబల్ టూరిజం డెవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆయనకు ఆహ్వానం పంపింది.
ఈ ఏడాది జూన్ 21, 22 తేదీల్లో గోవాలో జరిగిన జీ 20 పర్యాటక మంత్రుల సమావేశం అనంతరం ఈ ఆహ్వానం అందడం విశేషం. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి ఛైర్మన్గా వ్యవహరించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం, దేశాలు, వాటాదారుల మధ్య భాగస్వామ్యం, సహకారాల పెంపుకు జీ 20 టూరిజం వర్కింగ్ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది.
దీనిలో భాగంగా ‘ఇండియా డిక్లరేషన్, గోవా రోడ్ మ్యాప్’ అమలుపై ఐక్యరాజ్యసమితిలో ఆయన మాట్లాడనున్నారు.
కాగా హెచ్ఎల్పీఎఫ్ నుంచి ఈ ఆహ్వానాన్ని అందుకున్న తొలి భారతీయ పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి కావడం విశేషం.
కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలలో టూరిజం పాత్రను గుర్తిస్తూ గోవాలో నిర్వహించే సమావేశంలో చర్చలు జరగనున్నాయి.
పర్యాటక రంగాన్ని వేగవంతం చేయడంపై అగ్ర దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను ఒకే చోటకు చేర్చనున్నారు. ఈ ఈవెంట్ ద్వారా టూరిజం, ఎస్డీజీల మధ్య సంబంధాలను కూడా బలోపేతం చేయనున్నారు.