దేవరకొండ నియోజకవర్గంలోని గన్యా నాయక్ తండాకు చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గన్యా నాయక్ తండాకు చెందిన నేనావత్ వెంకటేష్ (24), నేనావత్ అనిల్ (19) ఇద్దరూ కలిసి కారులో తండా నుంచి హైదరాబాద్కు బయలుదేరారు.
ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా తక్కల్లపల్లి వద్ద ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తోన్న కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్, అనిల్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీం పట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.