తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ(చిట్యాల ఐలమ్మ) 128వ జయంతి సందర్భంగా రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఆనoతరం తెలంగాణ ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్న జయంతోత్సవం కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు సభ లో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. నిజాం పాలనకు, విసునూరు దేశ్ముఖ్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
ఆమె అనాడు చేసిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందని, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయ్యిందని మంత్రి చెప్పారు.చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ.. ఆనాటి దేశ్ముఖ్లు, రజాకార్ల గుండెల్లో దడ పుట్టించాయన్నారు. ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే మరోవైపు అమ్మలా ఉద్యమకారులకు అన్నం పెట్టిన మహనీయురాలు ఐలమ్మ అని పువ్వాడ కీర్తించారు.