మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రానికి చెందిన బ్యాగరి కృష్ణయ్య అంజమ్మల దంపతుల చిన్న కుమారుడైన శ్రీను మహబూబ్ నగర్ రూరల్ మండలం మన్నెంకొండ (ధర్మాపూర్ ) గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. దళిత ( మాల) విద్యార్థి అయిన బ్యాగరి శ్రీను మంగళవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో గురుకుల పాఠశాల పై నుండి క్రింద పడి ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మొన్న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మృతి చెందాడు.
బ్యాగరి శ్రీను మరణం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మూడంతస్తుల పైనుంచి కింద పడిన శ్రీను చుక్క రక్తం బొట్టు కూడా కారలేదని, అంతేకాక కనీసం ఎక్కడ కూడా దెబ్బలు తాకిన దాఖలాలు లేవని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య అన్నారు. శ్రీను మృతికి గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. శ్రీను మృతికి కారకులైన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వార్డెన్లపై చట్టపరమైన చర్యలు
తీసుకొని వారిని విధుల నుండి తొలగించాలని నర్సింహయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ మాల మహానాడు మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య మాట్లాడారు. బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, రెండు పడకల ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం
ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంగా తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు, ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాడం రాఘవేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాడం వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు పత్తి శ్రీను, జిల్లా కార్యదర్శి పత్తి బాలరాజ్, పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్, మహబూబ్నగర్ రూరల్ మండలం అధ్యక్షులు కజిరవనం నరేష్, కొత్తపేట గ్రామ ఉపాధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.