ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు వేచి ఉండకుండా త్వరితగతిన చేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ కె.జి.హెచ్. వైద్యులను ఆదేశించారు.
గురువారం ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చాంబర్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబుతో కలసి కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న సేవలపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ పేషెంట్లు ఆసుపత్రికి బయట ఎవరూ వేచి ఉండరాదన్నారు. డిస్చార్జ్ చేసిన వారిని వెంటనే వేచి ఉండకుండా పంపాలని తెలిపారు.
కోవిడ్ చిన్న చిన్న లక్షణాలు ఉన్నవారికి, సివియర్ గా ఉన్నవారికి అందిస్తున్న వైద్య సేవలు గూర్చి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అవసరం అనుకుంటే ఆక్సిజన్ పెట్టాలని తెలిపారు. కెజిహెచ్ లో ప్రస్తుతం ఉన్న పడకల సంఖ్య కంటే మరో 60 పడకలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మూడు సిప్టులలో డాక్టర్లు అందిస్తున్న వైద్య సేవలు గూర్చి ఆయన అడిగి తెలుసుకున్నారు.
వైద్య సిబ్బంది అవసరము ఉందా అని కలెక్టర్ అడుగగా ప్రత్యేక వైద్యులు, వైద్యులు, నర్సులు, ఎనస్తీషియన్లు, ఇ.సి.జి.టెక్నీషియన్స్, ఎక్స్ రే, తదితర సిబ్బంది అవసరం ఉందని పర్యవేక్షకులు డా. మైథిలి వివరించారు.
ఈ సమావేశంలో ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, కె.జి.హెచ్. పర్యవేక్షకులు డా. మైథిలి, తదితర వైద్యులు పాల్గొన్నారు.