కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో నేడు విచారణ కొనసాగింది. రైతుల అనుమతి లేకుండా వారి భూములలో రిక్రియేషన్ జోన్ ఏర్పాటు చేసారని కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ గ్రామ రైతులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ నెల 20 న మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్టు తీర్మానించింది. అయితే రైతుల రిట్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు విచారణ నేటికి వాయిదా వేసింది.
దాంతో ఆ కేసు మళ్ళీ ఈరోజు విచారణకు వచ్చింది. విచారణ సందర్బంగా మాస్టర్ ప్లాన్ ను మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. టౌన్ ప్లానింగ్ యాక్ట్ సెక్షన్14 ప్రకారం ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని, మాస్టర్ ప్లాన్ పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేది ప్రభుత్వ నిర్ణయమన్నారు. అయితే ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయంఫై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలనీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22 కు వాయిదా వేసింది.