వచ్చే అక్టోబర్తో ముగియనున్న లిక్కర్ పాలసీ స్థానంలో కొత్త లిక్కర్ పాలసీని జగన్ సర్కార్ అమలు చేయబోతున్నదా? గతంలో అమలు చేసిన లిక్కర్ పాలసీని మరోసారి తెరమీదకు తీసుకురావడానికి జగన్ ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. కొత్త లిక్కర్ పాలసీ అంటే జగన్ ప్రభుత్వంలోకి రాక ముందు ఉన్న లిక్కర్ పాలసీని తీసుకువస్తే జనం నుంచి మరింత ఎక్కువ మద్యంపై ఆదాయం సంపాదించవచ్చునని ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యనిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చిన వై ఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన వ్యాఖ్యలకు సవరణలు ఇచ్చుకున్నారు. దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తానన్న ఆయన, లిక్కర్ రేట్లను పెంచి ఫైవ్ స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తానన్నారు. ఆ దిశగా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకపోగా లిక్కర్ అమ్మకాలను దారుణంగా పెంచేసుకున్నారు. లిక్కర్ రేట్లను భారీగా పెంచడంతో బాటు తక్కువ క్వాలిటీ చీప్ లిక్కర్ని అందించి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే సమయంలో తాను తీసుకువచ్చిన ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ఇప్పుడు మళ్లీ ప్రయివేటు మద్యం దుకాణాలు తీసుకురావాలనే యోచనలో జగన్ ఉన్నట్లు తెలిసింది. తాజాగా మద్యం దుకాణాల లైసెన్స్ల కోసం తెలంగాణలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్కో టెండర్ దారుడు లైసెన్స్ కోసం రెండు లక్షల రూపాయలకుపైగా ఫీజ్ చెల్లించాల్సి వచ్చింది. వీటిద్వారా తెలంగాణ సర్కార్కి ఏకంగా రూ. 2500 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. దాంతో జగన్ మళ్లీ ప్రయివేటు వారికి లిక్కర్ షాపులు ఇవ్వాలనే యోచన చేస్తున్నారని అంటున్నారు.
దీనిద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అంచనా వేసుకుంటున్నారు. లిక్కర్ దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించడం వల్ల అనేక మంది పార్టీ కార్యకర్తలు, నేతలకు ఆదాయం తగ్గిపోయిందని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది వైసీపీ కేడర్లోనే నెగిటివ్గా మారిందనే రిపోర్టులు అందాయట.. ఎన్నికలకు ముందు మరోసారి కేడర్కి చేరువ కావడానికి లిక్కర్ పాలసీని మార్చాలని భావిస్తోందట జగన్ సర్కార్..