రైతులకు మరిన్ని సేవలు అందించి వ్యవసాయాన్ని పండగలా చేయడమే సీఎం జగన్ ఆశయమని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో వైఎస్సార్ యంత్ర సేవ పథకాన్ని ప్రారంభించి వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ ప్రాతిపదికన రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులకు వివిధ యంత్రాలను అందజేశారు.
అనంతరం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నడిపిన శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ రెడ్డి గురుమూర్తి, వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి తదితరులు ఎమ్మెల్యేను ఉచిత రీతిన సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ దేశానికి రైతే వెన్నెముక అనే సిద్ధాంతంతో రైతులను అన్ని విధాల ఆదుకుంటున్న సీఎం అనేక ప్రయోజిత పథకాలను అందిస్తున్నారన్నారు.
రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు పెట్టుబడులను అందించి వారిని ఆదుకుంటున్న విషయాన్ని గుర్తించాలన్నారు. గతంలో కౌలు రైతులు, వ్యవసాయాన్ని విడిచిపెట్టిన రైతులు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన రైతులు అనేక కష్టాలతో రాష్ట్ర రైతాంగం విలవిలలాడిందని అన్నారు. నవరత్నాలు అమలులో భాగంగా సీఎం ఎంతో దూరదృష్టితో రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ రూపేణా అందిస్తున్నారన్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలకు, ఎరువులకు ఇబ్బందులు లేకుండా మంజూరు అవుతున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే అందుకు అధికారులు కృషి ఎంతో అవసరం అన్నారు. ఆ రకంగా వ్యవసాయశాఖ జేడీ ఆశాదేవి చేస్తున్న కృషి మరువరానిది అని అన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ నడిపిన శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతును రాజుగా చేయాలన్న ఉద్దేశంతో సీఎం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు మేలైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్ కెల్లత్రినాధ రావు, మండల పార్టీ నాయకులు మామిడి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.