నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్పూర్తిదాయకమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.చిట్యాల ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న సందర్భంగా వారి త్యాగాలను పోరాట స్పూర్తిని సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
నాటి కాలంలోనే, తన హక్కుల సాధన కోసం న్యాయస్థానాల్లో చట్టపరమైన పోరాటం చేసిన ప్రజాస్వామిక వాది, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మ అని సిఎం కొనియాడారు. నాటి వారి స్పూర్తి తెలంగాణ సాధనలోనూ అనంతర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి వున్నదని సిఎం కేసీఆర్ తెలిపారు. చిట్యాల ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నదని సిఎం అన్నారు.
దేశంలో మరెక్కడాలేని విధంగా రజకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సిఎం తెలిపారు. మహిళలు, బీసీ, ఎంబీసీ ల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు సత్పలితాలనిస్తున్నాయని సిఎం అన్నారు.
సబ్బండ కులాల జీవన ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం గుణాత్మకంగా అభివృద్ధి పరు స్తున్నదని, బీసీ,ఎంబీసీ మహిళల సంక్షేమం కోసం తమ కృషి కొనసాగుతూనే వుంటుందని సిఎం స్పష్టం చేశారు.