హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఆలశ్యం కావడంతో ప్రయాణీకుల తీవ్ర ఆందోళన చేస్తున్నారు. సరైన కారణం చెప్పకుండా గంట గంట అంటూ సమయం పెంచుతూ 4 గంటల ఆలశ్యం చేసిన నిర్వాహకులు ప్రయాణీకులకు సరైన సమాచారం కూడా ఇవ్వడం లేదు. నేటి ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ విమానం ముందుగా 1 గంట ఆలస్యం అన్నారు. ఆ తరువాత 8:30కి అన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుందని అంటున్నారు. అత్యవసర పనులపై విశాఖపట్నం వెళ్లాలనుకున్న ప్రయాణీకులు ఎయిర్ ఇండియా వల్ల తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు. విశాఖపట్నంలో జరిగే పరీక్షకు హాజరయ్యేందుకు బయలుదేరిన ఒక యువతి విమానం తీవ్రమైన జాప్యం కావడంతో నిరాశకు లోనై ఏడ్వడం అక్కడి వారి హృదయాన్ని కలచి వేసింది. ఇదే విధంగా ఎంతో మంది ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ఇంతకీ విమానం ఎందుకు ఆలశ్యం అయిందో తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. విమానం ఆలశ్యం కావడానికి ఒక చిన్న ఎలుక కారణంగా చెబుతున్నారు. విమానంలో ఎలుక దూరడం, దాన్ని పట్టుకోవడం విమాన సిబ్బందికి చేతకాకపోవడంతో విమానాన్ని నిలిపివేశారు. పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత విమానంలో ఎలుక లేదని తేల్చారట. అయితే అనుమానం వీడకపోవడంతో విమానాన్ని నడిపేందుకు సిబ్బంది సాహసించడం లేదని తెలిసింది.
previous post