75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవాల ర్యాలీని బొబ్బిలిలో నిర్వహించారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యుత్ మహోత్సవాల్లో భాగంగా పట్టణంలోని యుద్ధ స్మారక స్థూపం నుంచి వేణుగోపాల స్వామి ఆలయం వరకు 150 అడుగుల జాతీయ జెండాతో పట్టణ పౌరులు, విద్యుత్ శాఖ సిబ్బంది, సచివాలయ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు.
మునిసిపల్ చైర్ పర్సన్ సావు వెంకటమురళీకృష్ణ, రెవిన్యూ డివిజనల్ అధికారి శేషశైలజ, విద్యుత్ మహోత్సవాల జిల్లా నోడల్ అధికారి, ఎన్.టి.పి.సి. సింహాద్రి డిజిఎం ఆనంద్బాబు, ఇ.పి.డి.సి.ఎల్. పర్యవేక్షక ఇంజనీర్ నాగేశ్వరరావు, నెహ్రూ యువకేంద్రం అధికారి విక్రమాదిత్య, బొబ్బిలి ఆపరేషన్ సర్కిల్ డి.ఇ. హరి తదితరులు పాల్గొన్నారు.
ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఉజ్జ్వల భారత్, ఉజ్జ్వల భవిష్యత్ నినాదంతో దేశవ్యాప్తంగా విద్యుత్ రంగ ప్రగతిపై మహోత్సవాలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా 27న బొబ్బిలిలో, 30న విజయనగరంలో విద్యుత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా నోడల్ అధికారి ఆనంద్బాబు చెప్పారు. వచ్చే 25 ఏళ్ల కాలంలో దేశ విద్యుత్ రంగ ముఖచిత్రం ఏవిధంగా వుంటుందో తెలిపేలా ప్రదర్శనలు వుంటాయన్నారు.