వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ బర్రెంకల మధుసూదన్ సూచనతో ట్రస్ట్ సభ్యురాలు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కుమార్తె వాణి పటాలే సహకారంతో పేద చేనేత కార్మికులకు నిత్యావసర వస్తువులు అందచేశారు.
ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చిప్ప రఘురాములు, కోశాధికారి కందగట్ల స్వామి తదితరులు మంగళవారం రోజున యాదాద్రి జిల్లా రామన్నపేట నియోజక వర్గం వెల్లంకి గ్రామ చేనేత సహకార సంఘ కార్యాలయం ఆవరణలో బాపూజీ విగ్రహానికి నూలు దండ వేసి నివాళి అర్పించారు. అనంతరం వెల్లంకి, సిరిపురం గ్రామాలలోని 70 చేనేత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో వంట నూనె, కారం, సబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలపై ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు, త్వరలోనే వారిని కలిసి, సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘ యువజన విభాగం జాతీయ అధ్యక్షులు గుండేటి శ్రీధర్, యాదాద్రి జిల్లా పద్మశాలి సంఘ కార్యదర్శి సంగిశెట్టి సాయిబాబా, చేనేత సహకార సంఘ నాయకులు వనం పురుషోత్తం, పున్న నర్సింహా, గంజి రంగయ్య తో పాటు స్థానిక సంఘ నాయకులు పాల్గొన్నారు.