ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత అల్ ఖైదా నాయకుడిగా మారిన అమాన్ అల్-జవహిరి వీడియో సందేశాల ద్వారా అమెరికా సహా పాశ్చాత్య దేశాలపై నిరంతరం విషం చిమ్ముతున్నాడు. ఇప్పుడు మరొక సందేశంలో, అతను రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై వ్యాఖ్యానించాడు. దానికి అమెరికాను నిందించాడు.
ఒసామా హత్య 11వ వార్షికోత్సవం సందర్భంగా అల్-ఖైదా విడుదల చేసిన వీడియోలో, జవహిరి మాట్లాడుతూ, ఉక్రెయిన్ నేడు రష్యా దాడులకు బలి కావడానికి అమెరికా “బలహీనత” కారణం అని చెప్పాడు. అల్-ఖైదా విడుదల చేసిన 27 నిమిషాల నిడివిగల వీడియోను SITE అనే ఇంటెలిజెన్స్ గ్రూప్ శుక్రవారం బట్టబయలు చేసింది.
ఈ బృందం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. వీడియోలో, జవహిరి పుస్తకాలు మరియు తుపాకీలతో టేబుల్పై కూర్చున్నట్లు చూడవచ్చు. ఆ వీడియోలో ముస్లింలు ఏకతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేస్తూ, అమెరికా ఇప్పుడు బలహీన దేశంగా మారిందని అన్నారు.
అతను ఒక సందర్భంలో 9/11 దాడులు, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో జరిగిన యుద్ధాల గురించి కూడా ప్రస్తావించాడు.ఈ వీడియోలో, ఉగ్రవాది జవహిరి మాట్లాడుతూ “ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో ఓటమి తర్వాత, 9/11 దాడుల తర్వాత, ఆర్థిక విపత్తు తర్వాత అమెరికా బలహీన పడ్డది అందుకే రష్యా తన పక్క దేశమైన ఉక్రెయిన్ పై దాడికి తెగబడ్డది” అన్నాడు.
అల్-జవహిరి 2011లో అల్-ఖైదా నాయకుడయ్యాడు. అంతకు ముందు ఒసామా బిన్ లాడెన్ ఈ సంస్థకు నేతృత్వం వహించాడు. అయితే అమెరికాలో మోస్ట్ వాంటెడ్ బిన్ లాడెన్ 2011లో పాకిస్థాన్లోని అబోటాబాద్లో హతమయ్యాడు.
అప్పటి నుండి, జవహిరి అల్ ఖైదా నాయకుడి పాత్రను స్వీకరించాడు. జవహిరిపై ఇప్పటికీ US గూఢచార సంస్థల నుండి $25 మిలియన్ల రివార్డ్ ఉంది.