ఏళ్లతరబడి కడప నగరాన్ని పాలిస్తున్న పాలకుల, అధికారుల నిర్లక్ష్యం, తప్పిదాలు, చిత్తశుద్ధి లేమి మూలంగా వర్షం వచ్చిన ప్రతిసారి కడప నగరం జలమయం అవుతున్నదని సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ పేర్కొన్నారు.
జలమయమైన ఆర్ట్స్ కాలేజీ, ప్రకాష్ నగర్, భరత్ నగర్, ఏ ఎస్ ఆర్ నగర్, మృత్యుంజయ కుంట తదితర ప్రాంతాల్లో సిపిఐ నాయకులు పరిశీలించారు.
స్థిరాస్తి వ్యాపార ప్రయోజనాలకోసం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ వద్ద బచ్చరావు చెరువు నీటి కాలువ అలైన్మెంట్ మార్పు చేశారని, కొత్తగా నిర్మించిన 4 లైన్ల రోడ్డు కింద యధావిధిగా కాల్వ బ్రిడ్జి నిర్మించకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించారని, అందుకే ఆర్ట్స్ కాలేజ్, గ్రౌండ్ పూర్తిస్థాయి నీట మునిగాయని అక్కడికి వచ్చిన కడప సబ్ కలెక్టర్ పృద్వి తేజ్ దృష్టికి సిపిఐ నాయకులు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా వెంకట శివ మాట్లాడుతూ పాలకొండలు మామిళ్లపల్లె ద్వారా రైల్వే బ్రిడ్జి కింద నుండి ఎన్టీఆర్ నగర్, ప్రకాష్ నగర్, నిరంజన్ నగర్, ఫరీదా నగర్ మీదుగా బుచ్చారావు చెరువులోకి సాఫీగా వెళ్లే నీటి ప్రవాహంను కాలువల ఆక్రమణలు, అలైన్మెంట్ ల మార్పు ద్వారా వర్షం పడ్డ ప్రతిసారీ వరద నీరు ఇళ్లలోకి వచ్చి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నదన్నారు.
ఆదివారం అర్ధరాత్రి నాలుగు గంటలపాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలతో పాటు సగం కడప నగరం పూర్తిస్థాయిలో జలమయం అయిందన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ప్రారంభించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పథకంకు 100 కోట్లు ఖర్చు పెట్టిన ఫలితం శూన్యం అని ఆరోపించారు. సక్రమంగా డ్రైనేజీ, మురికి కాలువలు లేక, చెరువు, కాలవల ఆక్రమణలతో పై ప్రాంతం, కింది ప్రాంతం జలమయం అవుతున్నదన్నారు. బచ్చరావు చెరువుకు సంబంధించిన దాదాపు పది ఎకరాల స్థలం బుద్ధ టౌన్ షిప్ యాజమాన్యం ఆక్రమించేశారని, వారితో పాటు ప్రకాష్ నగర్ స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాల కోసం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ వద్ద వరద నీటిని డ్రైనేజ్ కాలువ లోకి మళ్లించడానికి కుయుక్తులు పన్నారన్నారు.
తత్ఫలితంగా ఆర్ట్స్ కాలేజ్, ప్రకాష్ నగర్ తో పాటు భరత్ నగర్ , ఎన్ జీ వో కాలనీ తదితర ప్రాంతాల్లో నీటమునిగాయన్నారు. ఊటుకూరు చెరువు అలుగు కాల్వల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ లు వేయడం ద్వారా 48 వ డివిజన్ అల్లూరి సీతారామ రాజు నగర్ ,నంద్యాల నాగిరెడ్డి కాలనీ, చెంచు కాలనీ, రామరాజు పల్లి తదితర ప్రాంతాలు నీటమునిగాయన్నారు.
కడప మురికి మయం, జలమయం, అక్రమార్కుల మయం కాకుండా ఉండాలంటే కడప నగర కార్పొరేషన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి ని నియమించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి. మద్దిలేటి, శంకర్ నాయక్, వడ్ల భాగ్యలక్ష్మి, బాల ఓబయ్య, వీరాంజనేయులు, నారాయణ, జయరామయ్య, టిడిపి నగర నాయకులు కొండా సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.