మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో నవంబరు 3న ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, భారీగా పోలీసు బలగాలు మోహరించాం. మంగళవారం సాయంత్రం నుంచి విస్తృత తనిఖీలు చేపట్టనున్నాం అని ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన వారంతా నియోజకవర్గం నుంచి బయటికి వెళ్లిపోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం నిర్వహించకూడదన్నారు. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలున్నాయని, వీటిలో 35 పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయని, 10 కేంద్రాలను సమస్యాత్మక మైనవిగా గుర్తించాం అన్నారు.
3,366 మంది పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించాం అని, మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా, అందరికీ నమూనా స్లిప్పుల పంపిణీ ఇప్పటికే పూర్తి చేశాం అన్నారు. 80 సంవత్సరాలు దాటిన ఓటర్లు 2,576 మంది ఉన్నారు. 5,686 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నప్పటికీ 739 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తాం అన్నారు. అప్పటికే పోలింగ్ కేంద్రం లోపల ఉన్న వారికి కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తాం అని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నామని, పోలింగు నిర్వహణ కోసం 1,192 మంది సిబ్బందిని నియమించాం. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక సూక్ష్మ పరిశీలకుడిని నియమించామని ఆయన తెలిపారు.
100 ప్రాంతాల్లో చెక్పోస్టులు
శాంతి భద్రతలను పరిరక్షించేందుకు, ఓటర్లను ప్రలోభాలకుగురి చేసేందుకు చేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు నియోజకవర్గంలోని వంద ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన చెక్పోస్టులు24 గంటలూ తనిఖీలు నిర్వహిస్తున్నాయన్నారు. ఇప్పటికే వరకు రూ. 6.85 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నాం అని, 4,560 లీటర్ల మద్యాన్ని పట్టుకుని, 185 కేసులు నమోదు చేశాం అని వెల్లడించారు. బల్క్ సంక్షిప్త సందేశాలపై నిషేధం ఉందన్నారు.
వివిధ అంశాలపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి 479 ఫిర్యాదులు వచ్చాయని, చేతులపై పార్టీ గుర్తులు వేసినట్లు కూడా ఫిర్యాదులు వచ్చాయని, అన్నింటిపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారని, చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసుకు భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నుంచి వివరణ వచ్చిందని, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాంఅని, ఎన్నికల అధికారిపై సీఈవో కార్యాలయం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు అని వికాస్రాజ్ తెలిపారు.