తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు 10 రోజులు తెరిచేలా నిర్ణయం తీసుకోవడం మహా అపచారమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుమల “శ్రీవారి వైకుంఠ ద్వార” దర్శనానికి అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భక్తులను “ఏకాదశి” “ద్వాదశి” నాడు మాత్రమే అనుమతించాలని ఆయన కోరారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను పక్కన పెట్టి శ్రీరంగం ఇతర ఆలయాలతో పోల్చుతూ వైకుంఠ ద్వారాలు 10 రోజులు తెరిచేలా నిర్ణయాలు తీసుకోవడంపై టీటీడీ ఐఏఎస్ అధికారులు ధర్మకర్తల మండలి పునః పరిశీలన చేయాలని ఆయన కోరారు.
స్వార్ధంతో నిర్ణయాలు తీసుకోవడం అనర్ధం
తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలు కైంకర్యాలకు దశాబ్దాల నాటి చరిత్ర,ఓ ప్రత్యేకత ఉంది ఇతర ఆలయాలతో పోల్చి చూడకండి “భక్తుల సౌకర్యార్థం అన్న సాకుతో” ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మహా అపచారం అని ఆయన అన్నారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారాలను పదిరోజులపాటు తెరవమని టిటిడి ని ఎవరు కోరారు? రేపు మరో ప్రభుత్వం,ధర్మకర్తల మండలి అధికారంలోకి వచ్చి “365 రోజులు వైకుంఠ ద్వారాలు తెరుస్తాం” అని ప్రకటిస్తే పెద్ద జీయర్,ప్రధాన అర్చకులు,ఆగమ సలహామండలి అనుమతిస్తారా? అని నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
టిటిడి ఉన్నతాధికారులు సొంత మార్క్ కోసం గతంలో “లఘు” “మహాలఘు” దర్శనం ప్రవేశపెట్టి సామాన్య భక్తులకు శ్రీవారిని దూరం చేశారు నేడు వైకుంఠ ద్వారాలను పది రోజులు తెరిచి ఆలయ సంప్రదాయాలకు విఘాతం కలిగించే ప్రయత్నాలకు స్వస్తి పలకండి అని ఆయన అన్నారు.
తిరుమలలో వందల సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను సైతం కరోనా వైరస్ కారణంగా ఏకాంతంగా నిర్వహించారు,”శ్రీవారి చక్రస్నానం” సైతం ఆలయంలో చిన్న “తోట్టి” నిర్మించి జరిపించారు, అలాంటిది వైకుంఠ ద్వారం 10 రోజులు తెరిచి భక్తులను అనుమతిస్తే భక్తుల మధ్య భౌతిక దూరం ఎలా పాటిస్తారు? అని ఆయన ప్రశ్నించారు.