తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 8వ విడత హరితహారం కార్యక్రమం జూన్ మొదటి వారం నుండి ప్రారంభించేందుకు పకడ్బందీగా సన్నద్ధం కావాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మను చౌదరి తో కలిసి హరిహతహారం, పల్లె పట్టణ ప్రగతి సన్నద్ధత పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ వివరిస్తూ జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సం ఆయిన మరుసటి రోజు నుండే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తో పాటు తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. అందుకు తగ్గట్లుగా జిల్లాకు ఇచ్చిన హరితహారం లక్ష్యం 68.70 లక్షల మొక్కలు నాటేందుకు స్థలం గుర్తింపు చేసుకోవడం, ఏ మొక్కలు ఎక్కడ నాటాలి, మొక్కలు ఏ నర్సరీ నుండి తెచ్చుకోవాలి అనేది పకడ్బందీగా ప్రాణాళిక చేసుకోవాలన్నారు.
అధికారుల ద్వారా గుర్తించిన సైట్లకు వర్క్ ఎస్టిమేషన్ చేసే బాధ్యత మండల అభివృద్ధి అధికారులదే అని సూచించారు. మే, 31వ తేదీ లోపు ఎస్టిమేషన్ జనరేషన్ పూర్తి కావాలని ఎంపిడిఓ లను ఆదేశించారు. ఈ సారి ఇరిగేషన్ సైట్ల పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, ఇరిగేషన్ శాఖ కు సంబంధించిన ఖాళీ స్థలంలో , కెనాల్ పొంటి, మట్టితీసిన, పోసిన ప్రాతాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఖాళీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు చేయాలని ఇరిగేషన్ అధికారిని ఆదేశించారు.
జాతీయ రహదారిపై, ఆర్.అండ్ బి, పంచాయతి రాజ్ రహదారుల పొడవునా మూడు వరుసల్లో మొక్కలు కనిపించాలని మొదటి వరుసలో పెద్ద ఎత్తున టెకోమ లాంటి పూల మొక్కలు నాటాల్సిందిగా ఆదేశించారు. పల్లె , పట్టణ ప్రగతిలో పారిశుద్ధ్యం, హరితహారం, విద్యుత్ వైర్లు వంటి కార్యక్రమాలు పకడ్బందీగా ఉండాలని, చేసిన పనులకు ఫోటోలు తీయించి ఆల్బం గా చేసి పంపించాలన్నారు.
ప్రతి కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విద్యాలయాల్లో పచ్చని మొక్కలు కనిపించే విధంగా మొక్కలు నాటాలని ఆదేశించారు. ఈ సారి ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ఆకస్మిక పర్యటనలు చేసే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఎక్కడ నిర్లక్ష్యానికి తావులేకుండా హరితహారం, పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, పి.డి. డి.ఆర్.డి.ఓ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా