అత్యంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న వై ఎస్ ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 5న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, టిటిడి ఈవో ధర్మారెడ్డి సంయుక్తంగా తెలిపారు.
ఆదివారం ఏప్రిల్ 5 న ఒంటిమిట్టలో జరిగే శ్రీ కోదండరామస్వామి వారి కల్యాణోత్సవం నిర్వహణకు సంబంధించి కల్యాణోత్సవం వేదిక, శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై టిటిడి ఈవో ధర్మారెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి, జేసి సాయికాంత్ వర్మ ,టిటిడి జేఈవో వీరబ్రహ్మం, ట్రైనీ కలెక్టర్ రాహుల్ మీనా.. లతో కలసి క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు పరిశీలించి నోడల్ అధికారులు, గ్యాలరీ ఇన్చార్జిలకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీన జరిగే సీతారాములవారి కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని రకాల ఏర్పాట్లను ప్రణాళిక బద్దంగా సిద్ధం చేయాలన్నారు. రాములవారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కళ్యాణవేదిక ముందు ఏర్పాటు చేసిన ఒక్కో గ్యాలరీకి ఒకరిని ఇప్పటికే ఇంఛార్జిగా నియమించామని , వారందరూ తమకు అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలన్నారు. భక్తుల కోసం తగినన్ని మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచుతామన్నారు. ఎక్కడా కూడా జనం తొక్కిసలాట జరుగకుండా అధికారులు, పోలీస్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ స్థలం నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. స్వామి వారి కల్యాణం ముగిసిన తరువాత భక్తులు తమ గమ్యస్థానాలకు వెళ్ళేందుకు వీలుగా తగినన్ని బస్సులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను ఉంచాలని సంభందిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక, కనీస వసతులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీరు, భక్తులకు అన్నప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు ఏర్పాటు, కంట్రోల్ రూం ఏర్పాటు, సీసీ కెమెరాలు, విద్యుత్, అగ్నిమాపక వాహనాలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, 108 వాహనాలు, అత్యవసర మందులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, తాత్కాలిక మెడికల్ క్యాంపులు, అక్కడక్కడ హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు మొదలైన అన్ని అంశాలను ఎలాంటి కొరత లేకుండా ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
కల్యాణవేదిక వద్ద ఈవో ధర్మా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కల్యాణం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు తెలిపారు. కల్యాణవేదిక వద్ద భక్తులు గ్యాలరీల్లోకి ప్రవేశించే ముందే ముత్యంతో కూడిన తలంబ్రాలు, పసుపుకుంకుమ, అన్నప్రసాదం ప్యాకెట్ అందిస్తామని, భక్తులు ఎలాంటి తొందరపాటు లేకుండా వీటిని స్వీకరించి సంతృప్తికరంగా కల్యాణాన్ని దర్శించాలని కోరారు. భక్తుల కోసం తగినన్ని మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచుతామన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆలయ పరిపాలన భవనం వద్ద గల విశ్రాంతి గృహం, ఆలయం, పరిసర ప్రాంతాలు, కల్యాణవేదిక వద్ద చేపట్టిన ఏర్పాట్లను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్వో గంగాధర్ గౌడ్, కడప, బద్వేల్ ఆర్డీవోలు ధర్మచంద్రా రెడ్డి, వెంకటరమణ, డ్వామా పీడి యదుభూషన్ రెడ్డి, అదనపు ఎస్పీ కృష్ణారావు డీఎస్పీ శివారెడ్డి, సమగ్ర శిక్ష ఏపిసి ప్రభాకర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.నాగరాజు, సమాచార శాఖ ఏడి వేణుగోపాల్ రెడ్డి, టిటిడి పిఆర్వో రవి, డీపీఓ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ సీఈవో సుధాకర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ్ కుమార్, టిటిడి చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి, నోడల్ అధికారులు, గ్యాలరీ ఇన్చార్జిలు, తదితరులు పాల్గొన్నారు.