ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిని ఇక్కడే ఉంచాలని అన్ని ప్రాంతాల ప్రజలు కోరుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిని మార్చవద్దని కోరుతూ టీడీపి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన 24 గంటల నిరాహారదీక్ష శిబిరంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విజయవాడ రాజకీయ చైతన్యానికి మారుపేరు అన్నారు. విజయవాడ ఏం ఆలోచిస్తుందో రాష్ట్రమంతా అదే ఆలోచించేది. మన పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్లకూడదనే రాజధానికి శ్రీకారం చుట్టాం. విశాఖను ఫార్మాహబ్, పర్యాటక కేంద్రంగా మార్చాలని అనుకున్నాం.
సీఎం, మంత్రులు రోజుకు ఒకలా మాట్లాడుతున్నారు. నాపై ఉన్న కోపం అమరావతిపై చూపించకండి. అమరావతిలో ఇప్పటికే అన్ని భవనాలు ఉన్నాయి. అమరావతిలో పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కమిటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే దర్యాప్తు చేయండి. అన్ని ప్రాంతాల వాళ్లు రాజధానిగా ఉంచాలని కోరుతున్నారు.
విశాఖ రాజధాని వద్దని అన్ని జిల్లాల వాసులు కోరుతున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు విశాఖ చాలా దూరంగా ఉంది. అమరావతిలో పునాదులకు ఎక్కువ ఖర్చు అనేది తప్పుడు ప్రచారం. ప్రపంచవ్యాప్తంగా నాగరికత వెలిసిందే నదుల పక్కన. అమరావతికి జరుగుతున్న అన్యాయంపై పార్టీల నేతలంతా గళమెత్తాలి. అమరావతికి విపక్షాలన్నీ మద్దతిస్తున్నాయి.
అమరావతిపై రాష్ట్రంలో ఉండే ప్రతిఒక్కరూ ఆలోచించాలి. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు.. మూడు రాజధానులు కాదు.. విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. పెద్దల పోరాటానికి యువత, విద్యార్థులు మద్దతివ్వాలి. అమరావతి ఐకాసలకు ప్రజలే విరాళాలు ఇవ్వాలి. ధైర్యంగా పోరాడితే చరిత్రలో మిగులుతాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.