ఎస్ సి వర్గీకరణపై తప్పుడు మాటలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లిస్తారని మాలల చైతన్య సమితిరాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని తెలంగాణ చౌరస్తా లో నేడు నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దహనం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం ఎస్ సి వర్గీకరణ అంశాన్ని బిజెపి పదే పదే ప్రస్తావిస్తున్నదని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2004 సంవత్సరం లో కేసు కొట్టేసిందని ఆయన గుర్తు చేశారు. అయినా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించకుండా స్వార్థ రాజకీయ ఓటు బ్యాంకు కోసం తెలంగాణ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టడానికి మతోన్మాద బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆయన అన్నారు.
అయినా సరే ఎస్సీల వర్గీకరణ చేస్తా అని దేశవ్యాప్తంగా మాల సామాజిక వర్గానికి ద్రోహం చేయాలని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ వారసులు సింహాలై గర్జిస్తారని ఆయన అన్నారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి ఉత్తర భారతంలో 17 రాష్ట్రాలు ఎస్సీల వర్గీకరణ సాధ్యం కాదని స్పష్టం చేసినప్పటికీ నరేంద్ర మోడీ ఉద్దేశపూర్వకంగా వర్గీకరణ చేస్తానని చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పత్తి యాదయ్య మంత్రి వెంకట్ రాములు ఎం ప్రసాద్ కత్తి శ్రీను ఎం శ్రీను ఎం రాములు కొండయ్య సత్యం తదితరులు పాల్గొన్నారు.