కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మున్సిపల్ జనరల్ బాడీ సమావేశానికి వచ్చి గౌరవ హోదాలో ఉండాల్సింది పోయి అక్రమాలకు పాల్పడుతున్న వారికి వత్తాసు పలికారని కౌన్సిలర్స్ ఆరోపించారు. బుధవారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని కొత్త నూతన లైబ్రరీ భవనం లో జరిగిన మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు పోతామని కౌన్సిలర్ మేకల రమ్యనాగరాజు, షేక్ రహీం పాషా, మాచుపల్లి బాల స్వామి, జ్యోతి శేఖర్, శ్రీ లక్ష్మి వేణు, నయిం తెలిపారు.
ఒక నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే అయ్యి ఉండి మహిళా ప్రజాప్రతినిధులను హేళన చేస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసమని గురువారం మీడియా సమావేశం లో ప్రశ్నించారు. ఎమ్మెల్యే అయినా కౌన్సిలర్స్ అయినా ప్రజలు ఓట్లతో ఎన్నికైన వారమేనన్న సంగతి మర్చిపోవద్దని వారన్నారు.
ఎమ్మెల్యే మీసాలు దువ్వుతూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఒక ఎమ్మెల్యే గా కాకుండా రౌడీలా వ్యవహరించారని చెప్పారు. తెలంగాణ సిఎం కేసీఆర్ అని తాము సంబోధించగానే మీ ముఖ్యమంత్రి ఏమిటి ఆయన మీకు ముఖ్య మంత్రి కాదు అని ఎమ్మెల్యే అన్నారని వారు తెలిపారు. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే ఇలా ముఖ్యమంత్రిని కూడా సంబోధించడం శోచనీయమని వారుఅన్నారు.
మున్సిపల్ నిధులను పక్కదారి పట్టిస్తూన్న వారికి ఎమ్మెల్యే వత్తాసు పలకుతున్నారన్నారు .కౌన్సిలర్లను భయ పెట్టడం సరైనది కాదని వారు తెలిపారు. ఎమ్మెల్యేగా ఉండి దిగజారి మాట్లాడడం,లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడుతూ, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఎవ్వరి నిజాయితీ ఏంటో చర్చకు వస్తే తెలిసిపోతుందన్నారు. చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. సింగోటం గ్రామ ప్రాజెక్టు పేరుతో తీసుకున్న ముడుపులు,పార్టీ మారినప్పుడు తీసుకున్న ముడుపుల బయటకు రావాలన్నారు. అంతేకాకుండా బుధవారం జరిగిన జనరల్ బాడీ సమావేశం నిజాయితీ లేని సమావేశంగా కౌన్సిలర్ బాలస్వామి అన్నారు.
కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పేద ప్రజలతో వసూలు చేసిన పన్నులను దోచుకు తినడానికి తయారయ్యారన్నారు. ఇందులో ఎమ్మెల్యే పాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. అవినీతితో ఆమోదించిన బిల్లు లొసుగులపై ప్రభుత్వ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు పోతామని వారన్నారు.