29.7 C
Hyderabad
May 2, 2024 04: 36 AM
Slider ముఖ్యంశాలు

మిడతల దండు రాకుండా కట్టడి చేసేందుకు చర్యలు

#KCR review meeting

మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి దూసుకురాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దులో గల జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు, ఫైర్ ఇంజన్లను, జెట్టింగ్ మిషన్లను, పెస్టిసైడ్లను సిద్ధంగా పెట్టినట్లు చెప్పారు.

మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించకుండా చూసే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించినట్లు చెప్పారు. మిడతల దండు తెలంగాణ వైపు వస్తే ఎలా వ్యవహరించాలనే విషయంపై సిఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు బి.జనార్థన్ రెడ్డి, ఎస్.నర్సింగ్ రావు, జయేశ్ రంజన్, పిసిసిఎఫ్ శోభ, డిసాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్  డిజి సంజయ్ కుమార్ జైన్, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, సిఐపిఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. జె. రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

దేశంలో మిడతల దండు ప్రవేశం, ప్రయాణం, ప్రభావం తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాబోయే రోజుల్లో అవి ఎటువైపు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని ఆరా తీశారు. రాజస్తాన్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని భండార, గోండియా మీదుగా మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ వైపు వెళ్తున్నట్లు సమాచారం ఉందని అధికారులు చెప్పారు.

తెలంగాణ వైపు రాకపోవచ్చునని అంచనా

అక్కడి నుంచి ఉత్తర భారతదేశంవైపు ప్రయాణించి పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతల దండు, ఒకవేల గాలి దక్షిణం వైపు మళ్లితే చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయని తేల్చారు.

తక్కువ అవకాశాలున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మిడతల దండు ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవి రాకుండా అడ్డుకునే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీని నియమించింది.

రామగుండంలో మకాం వేయబోతున్న కమిటీ

సిఐపిఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. జె. రహమాన్, వరంగల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అక్బర్, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్ భారతితో కమిటీని నియమించింది.

ఈ కమిటీ శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు రామగుండంలోనే మకాం వేస్తుంది. హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట పరిస్థితిని గమనిస్తూ ఉంటారు. మిడతల దండు సమీపంలోకి వస్తే వాటిని సంహరించే చర్యలను పర్యవేక్షిస్తారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ కార్యదర్శి, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ యూనివర్సిటీ విసి హైదరాబాద్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలి. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఆయా జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితికి అనుగుణంగా పనిచేయాలి.

సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, జీవన్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేషన్ల చైర్మన్లు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పార్టీ మారే విషయం మీడియా సృష్టి

Satyam NEWS

జగనన్న వసతి దీవెన` న‌గ‌దు విడుద‌ల‌…!

Satyam NEWS

మాస్టర్ ప్లాన్ విషయంలో ఇద్దరూ తోడుదొంగలే

Satyam NEWS

Leave a Comment