మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని విజయనగరంలో నిర్వహించిన సమైక్యతా ర్యాలీ అందరిలో స్ఫూర్తి నింపుతూ ఉత్సాహంగా సాగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి కోట జంక్షన్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా స్థాయి అధికారులు, అధికంగా యువత పాల్గొని 125 అడుగుల జాతీయ పతాకంతో కోట జంక్షన్ నుంచి ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వరకు ర్యాలీగా సాగారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కూడా కావటంతో ఈ సందర్భాన్ని కూడా స్మరిస్తూ మాదక ద్రవ్యాలకు అందరూ దూరంగా ఉండాలని నినదించారు.
ర్యాలీ ప్రారంభం సందర్భంగా అల్లూరి ధైర్య, సాహసాలను కొనియాడుతూ జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు యువతలో స్ఫూర్తి నింపారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో అల్లూరి చూపిన ధైర్య, సాహసాలు నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం జిల్లా యువజన అధికారి విక్రమాదిత్య యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అల్లూరిని స్ఫూర్తిగా తీసుకొని మంచి పౌరులుగా ఎదగాలని హితవు పలికారు.
ఈ జయంతి కార్యక్రమంలోజిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతి రావు, యువజన అధికారి విక్రమాదిత్య, మెప్మా పీడీ సుధాకర్, డీఎస్పీ మోహన్ రావు, రామ్ చందర్ కుమార్, డా.వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ మురళి, సూపరింటెండెంట్ శైలజా రాణి, అధిక సంఖ్యలో విద్యార్థులు, వాలంటీర్లు, యువత పాల్గొని అల్లూరికి ఘన నివాళి అర్పించారు.