తిరుమల శ్రీవారికి సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 16 నుండి 24వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 15వ తేదీ మంగళవారం నాడు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.
కోవిడ్ – 19 నిబంధనల మేరకు ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు.