కొద్దిరోజుల క్రితం పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షాను అమరీందర్ సింగ్ కలిశారు. దీంతో అమరీందర్ సింగ్ బీజేపీలో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై స్పందించిన ఆయన తాను బీజేపీలో చేరడం లేదని, కాంగ్రెస్ పార్టీని వీడతానని వెల్లడించారు.
తన ట్విట్టర్ పేజీ నుంచి ఇప్పటికే కాంగ్రెస్ లోగోను అమరీందర్ సింగ్ తొలగించారు. పంజాబ్లో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీరియస్ బాధ్యతలు అప్పగించిన సిద్ధూను ఓ చిన్నపిల్లాడిగా అభివర్ణించారు అమరీందర్. తాను 52 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్న అమరీందర్ సింగ్.. తనకు వ్యక్తిగతంగా నమ్మకాలు, సిద్ధాంతాలు ఉన్నాయని అన్నారు.
పంజాబ్లో కాంగ్రెస్ పతనమవుతోందని.. ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతోందని ఇటీవల జరిగిన సర్వే తేలినట్టు తెలిపారు. పంజాబ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయని.. కాంగ్రెస్, ఆప్, అకాళీదల్తో పాటు మరో ఫ్రంట్ కూడా ముందుకు రావచ్చని అన్నారు. సిద్ధూ ఎపిసోడ్తో కాంగ్రెస్ మళ్లీ అమరీందర్ సింగ్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోందనే వార్తలు వినిపించాయి.