బడుగు, బలహీన వర్గాల వారి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ప్రశంసనీయమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు మంత్రి నివాళులర్పించారు. డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాల స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులు ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఎదగాలని దళితబంధు లాంటి విప్లవాత్మకమైన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టారన్నారు. అంబేద్కర్ బాటలో పయనించి దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను కేసీఆర్ నేతృత్వంలో సాకారం చేసుకున్నామని వెల్లడించారు. దళిత్ ఎంపవర్మెంట్ కింద బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటున్నామని చెప్పారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
previous post