అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ లో తమకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు సీనియర్ జర్నలిస్టులు తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు సతీష్ ముదిరాజ్, సయ్యద్ గౌస్ పాషా, డిఎస్.హంసరాజ్ నాథ్, పాతూరి కళ్యాణ్ బాబులు మాట్లాడారు. ఏపీడబ్ల్యూజేఏ అధ్యక్షుడు అబ్బయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి పుండరీ చారి, అసోసియేషన్ లోని మరి కొంతమంది సభ్యుల ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలు తమను తీవ్రంగా బాధించాయని వారు తెలిపారు.
గౌరవ సభ్యులనే పేరుతో అసోసియేషన్ నుంచి తమను పక్కన పెట్టారని, కనీసం తమకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కట్టడం లేదని వారు ఆరోపించారు. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి పేరుతో ఏర్పడిన ఏపీడబ్ల్యూజేఏ, ఇప్పుడు ఆ జర్నలిస్టులకే తీరని అన్యాయం చేస్తుందని వారు ఆరోపించారు. తమను పక్కన పెట్టిన కారణంగా అసోసియేషన్ నుంచి తమకు రావలసిన న్యాయమైన వాటా కోసం ఏపీడబ్ల్యూజేఏ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులకు, కోశాధికారికి తాము లెటర్లు రాసిన స్పందించడం లేదని వారు ఆరోపించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు అయిన అబ్బయ్య గౌడ్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా తాము పంపిన లెటర్ ను కూడా స్వీకరించలేదని వారు ఆరోపించారు.ఈ పరిస్థితుల్లో ఏపీడబ్ల్యూజేఏ నుంచి తమకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం తాము హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు వారు తెలిపారు. ఏపీడబ్ల్యూజేఏ లో జరుగుతున్న అవకతవకలపై తాము సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.
సత్యం న్యూస్, అంబర్పేట్