ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరు గ్రామంలో త్రాగు నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. ట్యాంక్ పై భాగ నిర్మాణం పెచ్చులూడి పడిపోతుంది. ఈ వాటర్ ట్యాంక్ రహదారి ప్రక్కనే ఉండటం తో ఆ రహదారి వెంట నడిచే ప్రజలపై ఏ సమయం లో కూలిపోయి ప్రమాదం సంభవిస్తుందోనని గ్రామస్తులు ఆ రహదారిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడుస్తున్నారు.
అంతే కాదు అదే ట్యాంక్ ప్రమాద భరితంగా తయారై ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నప్పటికీ, బోరుద్వారా నీటిని నింపి ప్రజలకు త్రాగునీరు సరఫరా చేస్తున్నారు. ట్యాంక్ పై భాగమంతా ముక్కలు ముక్కలు గా కూలిపోయి ట్యాంక్ అడుగు భాగం లో నీటిలో ఉండిపోయి అన్నింటిలో కాకులు, కోళ్లు వ్యర్థాలను పడవేయడం తో త్రాగు నీరంతా కలుషితమై పోతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కుళాయిలు ద్వారా సరఫరా చేస్తున్న కలుషిత నీటినే త్రాగవలసి వస్తుందని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ కలుషిత నీరు త్రాగడం వల్ల ప్రజలకు డయేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తే పంచాయతీ బాధ్యత వహిస్తుందా, ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ బాధ్యత వహిస్తుందా అని వంగూరు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.